నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి తన పదవిని అడ్డం పెట్టుకుని, అడ్డదారిలో పోగేసిన అక్రమాస్తుల బాగోతం వెలుగులోకి వచ్చింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపు దాడులు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మల్లారెడ్డి తన సర్వీసు కాలంలో నిబంధనలకు విరుద్ధంగా, తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులను పోగేసినట్లు పక్కా సమాచారం అందుకున్న ఏసీబీ, పకడ్బందీ ప్రణాళికతో రంగంలోకి దిగింది.
నిజామాబాద్లోని ఆయన నివాసంతో పాటు,హైదరాబాద్, నల్గొండ, బంధువులు, బినామీలు సన్నిహితులకు చెందిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ సోదాల్లో బయటపడ్డ ఆస్తుల విలువ విస్తుగొలిపేలా ఉంది.
లెక్కల్లో రూ. 3 కోట్లుగా ఉన్నా, మార్కెట్ విలువ మాత్రం భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోదాల్లో అధికారులు గుర్తించిన ఆస్తుల జాబితా లో 4 నివాస గృహాలు, ఒక వాణిజ్య భవనం. 8 ఖాళీ స్థలాలు, ఏకంగా 10.23 ఎకరాల వ్యవసాయ భూమి. రూ. 3,31,000 నగదు, రూ. 50 లక్షల బ్యాంకు నిల్వలు.
అలాగే కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న 3 బ్యాంకు లాకర్లను సీజ్ చేశారు. ఖరీదైన గ్రాండ్ విటారా కారు, టీవీఎస్ స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. పత్రాల ప్రకారం ఆస్తుల విలువ సుమారు రూ. 3 కోట్లుగా చూపిస్తున్నా, వాస్తవ మార్కెట్ విలువ పదుల కోట్లలో ఉంటుందని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అవినీతి నిరోధక చట్టం, 1988 (2018 సవరణ)లోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు నమోదు చేసిన ఏసీబీ, మల్లారెడ్డిని అరెస్టు చేసింది. నిందితుడిని నాంపల్లిలోని ఎస్పీఈ & ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి, జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు.
లంచం డిమాండ్ చేస్తున్నారా? 1064కు కాల్ చేయండి!**ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది.
బాధితులు టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ (9440446106) ద్వారా సమాచారం అందించవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి.
