కార్పొరేషన్ లోని అన్ని విభాగాల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా స్పష్టం చేశారు.
మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఒక్కో విభాగాల వారీగా ఆయా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది ఏ మాత్రం అలసత్వం వహించినా ఊరుకునేది లేదన్నారు. ప్రధానంగా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
టౌన్ ప్లానింగ్ లో అనేక ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ నిర్మాణాలపై కొరడా జులుపించాలని చెప్పారు. కొందరు సిబ్బంది అలసత్వంతో పనిచేస్తున్నారని, అటువంటివారు తమ తీరును మార్చుకోవాలని తెలిపారు.
అలాగే ఇంజనీరింగ్ అధికారులు నగరంలో కొనసాగుతున్న పనులతో పాటు స్ట్రీట్ లైట్, పచ్చదనంపై దృష్టి సారించాలన్నారు. అలాగే కొనసాగుతున్న పనులు తొందరగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
వర్షాకాలం ని దృష్టిలో పెట్టుకుని శానిటేషన్ విభాగం అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. పలు డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థపై, చెత్త సేకరణ పై ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో, పెద్ద డ్రైనేజీల్లో అవసరమైతే జేసీబీ లు వినియోగించాలన్నారు.
గతంలో జరిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకొని పని చేయాలని తెలిపారు. మరో నెల రోజుల్లో మళ్లీ అన్ని విభాగాలతో సమావేశం నిర్వహిస్తానని చెప్పారు.
సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, ఆయా విభాగాధికారులు పాల్గొన్నారు.
