అభివృద్ధి కార్యక్రమాలలో అన్ని వర్గాల వారు భాగస్వాములు అయినప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం బోధన్ పట్టణం ఆచన్ పల్లిలోని ఏ.ఆర్ గార్డెన్ లో శనివారం నిర్వహించిన బోధన్ నియోజకవర్గ సభలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, మున్సిపల్ చైర్ పర్సన్ పద్మ శరత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు.
పంట రుణాల మాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహ జ్యోతి, చేయూత పథకం, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, సన్న ధాన్యంకు బోనస్ చెల్లింపు తదితర వాటి ద్వారా లబ్ది పొందిన వారి వివరాలు చదివి వినిపించారు. పలువురు లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల తమకు చేకూరిన ప్రయోజనాల గురించి సభలో తమ అనుభవాలను తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మునుముందు అమలు చేయనున్న పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రగతి, సంక్షేమంలో వారిని భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని అన్నారు.
అందరి అభిప్రాయాలను క్రోడీకరించి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించడానికి, సమస్యల పరిష్కారానికి ఈ సభలు దోహదపడతాయని అన్నారు.ప్రభుత్వం రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500/-కి గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్), కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్, చేయూత పథకం కింద పెన్షన్ లు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతోందని అన్నారు.
ఇంకనూ అర్హులు మిగిలి ఉంటే మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాలలో ప్రజా పాలన సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన వారికి ఆయా పథకాల ద్వారా లబ్ది చేకూర్చడం జరుగుతుందని భరోసా కల్పించారు. ఇందిరమ్మ ఇళ్ళ మంజూరీ తెలుపబడిన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.
వివిధ దశల ఇంటి నిర్మాణ స్థితిని లబ్ధిదారులు వారే స్వయంగా సెల్ఫ్ పోటో క్యాప్చరింగ్ ద్వారా ఇందిరమ్మ వెబ్ సైట్ లో అప్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారని గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
త్వరలోనే ప్రభుత్వం రెండవ విడత కింద లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయనుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, అంగన్వాడీ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహార పథకాన్ని త్వరలో అమలు చేయనుందని వివరించారు.
ప్రాపెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం విజయవంతానికి అంకిత భావంతో కృషి చేయాలని, బడి బయటి పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. ప్రభుత్వం విద్యా రంగానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తోందని, ఇందులో భాగంగానే ఇటీవలే బోధన్ శివారు బెల్లాల్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం, మొక్కజొన్న సేకరణ జరుపుతున్నామని అన్నారు. ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంట కోల్పోయిన బాధిత రైతులకు పరిహారం అందజేయబడుతుందని తెలిపారు.
సర్వైకల్ క్యాన్సర్ నిరోధం కోసం ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత వేసవిలో ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. జిల్లాలో అన్ని నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు.
కాగా, ఇసుక అక్రమ రవాణాను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, ఇసుక అవసరం ఉన్న వారు మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మున్సిపల్ చైర్ పర్సన్ పద్మ శరత్ రెడ్డి మాట్లాడుతూ, బోధన్ పట్టణంలోని అన్ని వార్డులలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఎనలేని సహకారం అందిస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా కమిషన్ రూపంలో సమకూరిన రూ.3.80 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. అదేవిధంగా ఐసిడీఎస్ ద్వారా వంద అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు సెల్ ఫోన్లు అందజేశారు.
ముగ్గురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ చేశారు.ఈ సభలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డీడబ్ల్యూఓ పద్మ, ఏసీసి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
