యాంత్రిక జీవనంలో మానవత్వం మంటగలుస్తున్న వేళ.. అనాథలను, విధివంచితులను అక్కున చేర్చుకుని నిజామాబాద్కు చెందిన ‘ఇందూరు యువత’ స్వచ్ఛంద సంస్థ తన ఉదారతను చాటుకుంది. గతం గుర్తుకు రాక, ఆకలిదప్పికలతో రోడ్లపై అలమటిస్తున్న అభాగ్యులకు అండగా నిలిచేందుకు ‘మానవత్వంతో ఆలోచిద్దాం – 2026’ పేరిట శనివారం నగరంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎండలో మాడిపోతూ, పెరిగిన గడ్డాలు, అట్టలు కట్టిన జుట్టుతో.. కనీసం కదలలేని స్థితిలో మలమూత్రాల మధ్య పడి ఉన్న అనామకులను చూసి సంస్థ సభ్యులు చలించిపోయారు. సమాజం చిన్నచూపు చూస్తున్నా, భయంకరమైన దుస్థితిలో ఉన్న వారిని చేరదీసి స్వయంగా సపర్యలు చేశారు.
వారిని శుభ్రం చేసి, కొత్త బట్టలు ధరింపజేశారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారిని 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందేలా చూశారు.
ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ ఏసీపీ బి. ప్రకాష్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనే నిజమైన తృప్తి ఉందని, ఇందూరు యువత చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో 1వ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి, రైల్వే పోలీస్ సిబ్బందితో పాటు ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు, కోశాధికారి జయదేవ్ వ్యాస్, సభ్యులు మద్ది గంగాధర్, అఫ్రోజ్, మయూర్, ఇందూరు యువత టీం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
