ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా ‘కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్’ నిరసన** అత్యవసర సేవల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. అధికారుల నంబర్లు విడుదలఆన్లైన్ ఫార్మసీల (ఇ-ఫార్మసీ) విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ విజయవంతంగా కొనసాగుతోంది.
జిల్లా వ్యాప్తంగా సుమారు 1400 వరకు ఉన్న మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. కేవలం నిజామాబాద్ టౌన్ పరిధిలోనే దాదాపు 700 ఔషధ దుకాణాలు బంద్లో పాల్గొనడంతో వ్యాపారాలన్నీ నిలిచిపోయాయి.
కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఫార్మసీల నిర్వాహకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. కార్పొరేట్ ఇ-ఫార్మసీల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
ఆన్లైన్ సంస్థలు ఇష్టారాజ్యంగా ఇస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల స్థానిక చిన్న, మధ్యతరహా మెడికల్ షాపుల మనుగడ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ప్రిస్క్రిప్షన్లతో ఆన్లైన్లో మందులు విక్రయించడం వల్ల యువత ప్రాణాల మీదకు వస్తోందని హెచ్చరించారు.
కరోనా సమయంలో మందుల హోమ్ డెలివరీ కోసం తెచ్చిన తాత్కాలిక జీవో (GSR 220(E))ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా వందలాది మెడికల్ షాపులు బంద్ కావడంతో ఉదయం వేళల్లో రోగులు, వారి బంధువులు మందుల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ప్రజల అత్యవసర అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా డ్రగ్స్ కంట్రోల్ విభాగం ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మెడికల్ స్టోర్లు అందుబాటులో ఉండేలా అధికారులు పర్యవేక్షించారు. జిల్లాలో రోగులకు అత్యవసరంగా మందులు కావలసి వస్తే ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను క్రింది అధికారులను, ప్రతినిధులను సంప్రదించాలని యంత్రాంగం ప్రకటించింది.
బి. గంగాధర్:9848390388 . బి. మురళి: 9381741474 డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్: 8333925864అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని, మందుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
