ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో ఇద్దరు నిందితులకు రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, చెరో రూ. 5,000 జరిమానా విధిస్తూ నిజామాబాద్ ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీమతి హరీష గురువారం సంచలన తీర్పు వెలువరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ మండలం ధర్మారం (ఎం) తండాకు చెందిన కేతావత్ సంతోష్ (27), కేతావత్ శ్రీను (24)లు 2019లో ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చారు.
దీనిపై అప్పట్లో ముగ్పాల్ సబ్ ఇన్స్పెక్టర్ ఎ. పూర్ణేశ్వర్ కేసు (క్రైమ్ నెం: 121/2019, U/sec: 353 r/w 34 IPC, సెక్షన్ 3 PDPP యాక్ట్) నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
ఈ కేసు (CC No: 05/2024) గురువారం ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చింది. నిందితులపై మోపబడిన నేరాలు ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహారెడ్డి సమర్థవంతంగా వాదనలు వినిపించి, సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచారు.
నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి హరీష నిందితులిద్దరికీ ఐపిసి 353 సెక్షన్ కింద రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు, చెరో ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా నెల రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా చేయడంలో ముగ్పాల్ సబ్ ఇన్స్పెక్టర్ జె. సుస్మిత, కోర్టు లైజన్ ఆఫీసర్ టి. గోవింద్, సీఎంఎస్ సీడీఓలు పీసీ నవీన్ కుమార్, పీసీ విషన్ గౌడ్, పీసీ మనోహర్లతో పాటు ముగ్పాల్ పీఎస్ సీడీఓలు ఏ. సంతోష్ కుమార్ , ఎం. శ్యామ్ రావు లు క్రియాశీలక పాత్ర పోషించి, సాక్షులను సకాలంలో కోర్టులో ప్రవేశపెట్టారు.
ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగిస్తే చట్టం ముందు ఎంతటి వారైనా లొంగాల్సిందేనని ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువైందని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి.
