ఆటో ఎక్కిన ఓ వృద్ధురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె మెడలోని బంగారు గొలుసు, నగదు దోచుకున్న ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు త్రీటౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు.
ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.ఈ నెల 20వ తేదీన ఉదయం 11 గంటల ప్రాంతంలో నిజామాబాద్ పట్టణంలోని కెనాల్ కట్ట వద్ద ఓ 70 ఏళ్ల వృద్ధురాలు శుభకార్యానికి వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కింది.
కాగా, ఖానాపూర్కు చెందిన ఆటో డ్రైవర్ విజయ్ సదరు వృద్ధురాలిని గమ్యస్థానానికి చేర్చకుండా, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను భయభ్రాంతులకు గురిచేసి, మెడలోని 2 తులాల బంగారు గుండ్ల పేరుతో పాటు ఆమె వద్ద ఉన్న రూ. 200 నగదును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.సీసీఎస్, త్రీటౌన్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టి, సోమవారం నమ్మదగిన సమాచారం మేరకు నిందితుడు విజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారు గొలుసును రికవరీ చేసి, నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీస్ సిబ్బందిని పలువురు అభినందించారు.
