పోలీస్ శాఖలో ఎంతో పనిఒత్తిడి ఉన్నప్పటికీ.. ఎలాంటి రిమార్కు లేకుండా సుదీర్ఘ కాలం విధులు నిర్వహించి పదవీ విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు.
పోలీస్ శాఖ నుంచి పదవీ విరమణ పొందిన ఆరుగురు అధికారులు, సిబ్బందికి శనివారం కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పదవీ విరమణ పొందిన వారిలో ఆఫీస్ సూపరింటెండెంట్ అహమ్మద్ అబ్దుల్ బషీర్ (41 ఏళ్ల సర్వీసు), ఆర్మూర్ ఎస్ఐ గైక్వాడ్ అప్పారావు (42 ఏళ్లు), సీసీఆర్బీ ఎస్ఐ బాదావత్ శివరాం (37 ఏళ్లు), మాక్లూర్ ఎస్ఐ సేరుపల్లె మొగులయ్య (37 ఏళ్లు), సీఎస్బీ ఏఎస్ఐ మువ్వ లింగారావు (36 ఏళ్లు), ఆర్మూర్ హెడ్ కానిస్టేబుల్ మస్కే జీవన్ (33 ఏళ్లు) ఉన్నారు.
ఈ సందర్భంగా సీపీ వారిని శాలువాలతో సత్కరించి, పదవీ విరమణ సర్టిఫికేట్లు, జ్ఞాపికలను అందజేశారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనేది సహజ ప్రక్రియేనన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది అందించిన సేవలను ఆయన కొనియాడారు.
పదవీ విరమణ అనంతరం కూడా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రిటైరైన సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో శేష జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్.శుభం ప్రకాష్, హోంగార్డ్స్ ఏసీపీ కె.దీపక్ చంద్ర, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, ఎ.జగతి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్ ధరణి కుమార్, ఎంటీఓ ఎస్.శేఖర్ బాబు, వెల్ఫేర్ ఆర్ఐ సతీష్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షాకిల్ పాషా, రిటైరైన సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
