మంతెన గ్రామంలో గురుడు కాపు సంఘం భవనంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై శనివారం చీతా ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ సిబ్బంది ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంతెన గ్రామంలోని సదరు భవనంపై దాడి చేయగా.. పలువురు వ్యక్తులు పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
నిందితుల నుంచి రూ. 4,880 నగదుతో పాటు 10 మొబైల్ ఫోన్లు, 3 కార్లు, ఒక మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోకు అప్పగించారు.
పేకాట, జూదం వంటి వ్యసనాలు కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటు సామాజిక శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.
కమిషనరేట్ పరిధిలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. జూదం, మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం వంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల పరిసరాల్లో ఇలాంటివి జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.
