తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జూన్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అధికారిక పండుగగా, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైంది.
ఈ మేరకు నిజామాబాద్ లో ప్రభుత్వ సలహాదారులు, బోధన్ శాసనసభ్యులు పి. సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ అలీ షబ్బీర్ ఆదిలాబాద్ లో అధికారికంగా పతాకావిష్కరణ చేస్తారు.
కామారెడ్డి లో వెనుకబడిన తరగతుల సంక్షేమ, అభివృద్ధి (బిసి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్) ప్రభుత్వ సలహాదారులు వి. హనుమంతరావు పాల్గొని జెండా ఎగురవేస్తారని ప్రభుత్వం ఖరారు చేసింది.జిల్లాల్లో నిర్వహించే వేడుకలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
జూన్ 2న ఉదయం 8:00 గంటలలోపు ఆయా జిల్లాల్లో కేటాయించిన ముఖ్య అతిథులు జాతీయ పతాకాలను ఎగురవేయనున్నారు. జెండా ఆవిష్కరణకు ముందే ప్రముఖులు స్థానిక తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాల (అమరవీరుల స్థూపాల) వద్దకు చేరుకుని పుష్పాంజలి ఘటించి, శ్రద్ధాంజలి ఘటించాల్సి ఉంటుంది.
ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు ప్రోటోకాల్ ప్రకారం ముందుగా స్మారక చిహ్నాల వద్దకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు.వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
