పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కామారెడ్డి జిల్లాలోని భవానీపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రమణారెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను, అలాగే డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో దోహదపడుతోందన్నారు.
అలాగే, సొంతిల్లు లేని నిరుపేదల కల సాకారం చేసేందుకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేస్తోందని, అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో భవానీపేట సర్పంచ్ శ్రీమతి దోమకొండ విజయ స్వామి, ఉప సర్పంచ్ శ్రీమతి ఆశన్న గారి మంజుల రమేష్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
