ఎస్ఐఆర్ (Special Intensive Revision) సర్వేలో భాగంగా మొదటి రోజు సంబంధిత బీఎల్ఓల నుంచి ఎన్యూమరేషన్ పత్రాలను స్వీకరించడం జరిగిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రతి అర్హత కలిగిన ఓటరు తమకు అందిన ఎన్యూమరేషన్ పత్రాన్ని పూర్తిగా, సరైన వివరాలతో నింపి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి, నిర్ణీత గడువులోగా సంబంధిత బీఎల్ఓ లేదా ఎన్నికల అధికారులకు అందజేయాలని కోరారు.
ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని, చిన్న నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో ఓటు నమోదు, సవరణ లేదా ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
అందువల్ల ప్రతి కుటుంబం ఈ ప్రక్రియను సీరియస్గా తీసుకుని, ఇంట్లోని ప్రతి అర్హత కలిగిన ఓటరికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయించాలని సూచించారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలందరూ ఎన్నికల సంఘానికి సహకరిస్తూ ఈ సర్వేను విజయవంతం చేయాలని, అలాగే తమ బంధువులు, స్నేహితులు, పొరుగువారిలో కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించేలా సహకరించాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల విజ్ఞప్తి చేశారు.
“మన ఓటు – మన హక్కు… మన బాధ్యత. ప్రతి ఓటరిని రక్షించుకుందాం… ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం.”
