పోలీసు ముసుగులో మోసాలకు పాల్పడుతున్న ముఠా ను అరెస్ట్ చేసినట్లుగా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. 12 మంది ని అరెస్టు చేశామని మరో ఇద్దరు పరారీ లో ఉన్నారని ఆమె చెప్పారు ఈ ముఠా అసలు పోలీసులు కూడా ఇద్దరు ఉన్నారని ఆమె పేర్కొన్నారు గురువారం సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు.
గత నెల 25న కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన కుర్రా గంగాధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తుపల్లి టౌన్ సీఐ టి. శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసారు ఏలూరు జిల్లా వెంకటాపురానికి చెందిన ఈద చంటి బాబు ప్రధాన సూత్రధారిగా గుర్తించినట్లు తెలిపారు.
అతడు మరో 13 మందితో కలిసి సిమ్ కార్డులు ఉపయోగించి వివిధ వ్యక్తులకు ఫోన్ చేసి తాము రియల్ ఎస్టేట్ వ్యాపారులమని, తమ వద్ద ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవాలని ఉందని నమ్మించేవారని చెప్పారు.
రూ.10 లక్షలు ఇస్తే రూ.40 లక్షలు ఇస్తామని నమ్మిస్తారని తాము నిర్దేశించిన ప్రాంతానికి డబ్బు తీసుకోని రావాలని చెప్తారు వారి నుంచి నగదు తీసుకోని తమ వద్ద ఉన్న నకిలీ నోట్లతో నింపిన బ్యాగును ఇచ్చేవారని వెల్లడించారు.
ఈలోపు ఇదే ముఠా కు చెందిన వారు పోలీసులు ఎంట్రీ ఇస్తారని నగదు తెచ్చిన వారు ఈ నకిలీ నోట్లు తీసుకోని పరుగులు పెడుతారు ఒక్కో సారి బాధితుల వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని పరారయ్యేవారని ఆమె వివరించారు.
ముందస్తు ప్రణాళికతో ఈ విధంగా పలు ప్రాంతాల్లో , మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసులో సత్తుపల్లి మండలం బీ. గంగారం 15వ బెటాలియన్ కానిస్టేబుల్ ముల్లగిరి వర్ధన్, ఆర్ఎస్ఐ బైరా కేశవరావు ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు.
అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి రూ.17.60 లక్షల నగదు, రెండు ఇన్నోవా కార్లు, ఒక ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను త్వరలోనే అరెస్టు చేసి కేసును పూర్తిస్థాయిలో ఛేదిస్తామని తెలిపారు.
