నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమల నాయక్ తండాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్ళిన పోలీసులపైనే స్థానికులు దాడికి పాల్పడటం కలకలం రేపింది. తిరుమల నాయక్ తండాలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య కొద్ది రోజులుగా తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. జీపు దిగి గొడవను సద్దుమణిగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులు రంగంలోకి దిగిన వెంటనే, అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు.
పోలీసు వాహనం దిగుతున్న సమయంలోనే వారి కళ్లలో కారంపొడి చల్లి, దాడులకు దిగారు. అక్కడితో ఆగకుండా, అధికారులను చుట్టుముట్టి కట్టేసి మరీ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులపై దాడి జరగడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బంది గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. విషయం తెలియగానే ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
అదనపు బలగాలను వెంటనే తండాకు తరలించారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
