హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ ఇంజినీర్ రవీందర్ నివాసం, కార్యాలయం సహా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల నివాసాలపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
అక్రమ మార్గాల్లో ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఈ మెరుపు దాడులు నిర్వహించారు. ఉదయాన్నే రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు, నగరంలోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టాయి.
ఇంజినీర్ రవీందర్కు సంబంధించిన కీలక పత్రాలు, బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు, సోదాల్లో భారీ మొత్తంలో నగదుతో పాటు పలు కీలకమైన ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
పలు ప్రాజెక్టుల విషయంలో అవినీతికి పాల్పడినట్లుగా ప్రాథమిక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. అయితే, స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తుల పూర్తి విలువ ఎంతనేది సోదాలు ముగిసిన తర్వాతే అధికారికంగా వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో జరుగుతున్న ఈ సోదాలు ఇంజనీరింగ్ వర్గాల్లో కలకలం రేపాయి.
