తనిఖీల్లో నిర్లక్ష్యం.. యాజమాన్యంపై కేసుహైదరాబాద్ కూకట్పల్లిలోని లులు మాల్లో గన్ కలకలం చోటుచేసుకోవడం కలకలం రేపింది. మంగళవారం మాల్ పార్కింగ్లో రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా పాతబస్తీకి చెందిన సిద్దిఖీ అనే వ్యక్తి వద్ద తుపాకీ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతడి వద్ద ఉన్న తుపాకీకి చట్టబద్ధమైన లైసెన్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
అయితే లైసెన్స్ ఉన్న ఆయుధంతో మాల్లోకి ఎలా ప్రవేశించాడనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ప్రాథమిక విచారణలో మాల్ ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది తగిన తనిఖీలు నిర్వహించకపోవడంతోనే ఆయుధంతో లోపలికి వెళ్లినట్లు తేలినట్లు సమాచారం.
సాధారణంగా మెటల్ డిటెక్టర్లు, బ్యాగేజీ స్కానింగ్, ఇతర భద్రతా తనిఖీలు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉండగా ఈ ఘటనలో భద్రతా ప్రమాణాల అమలులో లోపాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు.
భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు లులు మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని ఆదేశించారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
