చేవెళ్లలోని పట్నం మహేందర్రెడ్డి మెడికల్ కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్టైపెండ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కళాశాల ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు.
యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. విద్యార్థుల కథనం ప్రకారం, కొంతకాలంగా స్టైపెండ్ అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
విద్యా అవసరాలు, రోజువారీ ఖర్చులు నిర్వహించడం భారంగా మారిందని పేర్కొన్నారు. హాస్టల్లో తాగునీరు, పరిశుభ్రత, ఇతర మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు.
ఈ సమస్యలపై పలుమార్లు కళాశాల యాజమాన్యాన్ని ఆశ్రయించినా స్పందన లేదని విద్యార్థులు వాపోయారు. సమస్యల పరిష్కారానికి బదులుగా తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, కొందరు అధికారుల వ్యవహార శైలి కూడా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పెండింగ్ స్టైపెండ్ను వెంటనే విడుదల చేయడంతో పాటు హాస్టల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
