రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్ (పాత కలెక్టరేట్) వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ‘ఇందూర్ రణభేరి’ని నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ప్రకటించారు.
బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లపైనే ఆధారపడి చదువుకుంటున్నారని గుర్తుచేశారు.
ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రూ.11,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని మండిపడ్డారు. దీనివల్ల ఏటా రెండు లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని, 4.5 లక్షల మంది ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యాశాఖ బాధ్యతలను స్వయంగా ముఖ్యమంత్రే చూస్తున్నా, గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామన్న హామీని గాలికొదిలేశారని విమర్శించారు. ఒకవైపు మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేద విద్యార్థుల భవిష్యత్తును మాత్రం నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు.
ఇందూర్ రణభేరి కార్యక్రమానికి ఇందూర్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిపారు.
విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతంకర్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, బీజేవైఎం రాష్ట్ర కో-కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, కార్పొరేటర్ శ్రవణ్, ఐటీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, నాయకులు అంబదాస్ రావు, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వంశీ గౌడ్, విపుల్ రావు, రాజ్ గణేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
