లైంగిక నేరాలు, మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో బాధితుల గుర్తింపును బహిర్గతం చేయడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన న్యాయపరమైన చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు.
ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. బాధితుల పేరు, ఫొటో, వీడియో, ఇంటి చిరునామా, విద్యాసంస్థ, ఉద్యోగ స్థలం, కుటుంబ సభ్యుల వివరాలు, గ్రామం లేదా కాలనీ పేరు, సోషల్ మీడియా ఖాతాలు సహా వారి గుర్తింపును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వెల్లడించే ఎలాంటి సమాచారాన్నీ ప్రచురించరాదని స్పష్టం చేశారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాతో పాటు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ బాధితుల గుర్తింపును తెలియజేసే పోస్టులు, వీడియోలు, చిత్రాలు ప్రచురించడం చట్ట ఉల్లంఘనేనని పేర్కొన్నారు.భారత సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో పాటు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, పోక్సో చట్టం నిబంధనలను ప్రతి మీడియా సంస్థ, జర్నలిస్టు, సోషల్ మీడియా వినియోగదారు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
బాధితుల వివరాలు బయటపెట్టడం వల్ల వారికి, వారి కుటుంబ సభ్యులకు మానసిక వేదన, సామాజిక అవమానం, భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.
అందువల్ల బాధితుల గోప్యతను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. చట్టాలను ఉల్లంఘించి బాధితుల గుర్తింపును బహిర్గతం చేసిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
