నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సామానును లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు రూ. 2.40 లక్షల విలువైన ఖరీదైన స్మార్ట్ఫోన్లు, ఆపిల్ ఇయర్బడ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై హెచ్. సాయిరెడ్డి తెలిపారు.
ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం ఎస్సై సాయిరెడ్డి, సిబ్బందితో కలిసి ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కల్పనతో కలిసి రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారాలపై ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు.
విచారణలో వారు తాము చేసిన నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.ద్వారకానగర్, నిజామాబాద్ కు చెందిన సయ్యద్ మజిద్ అలీ,ఖోజా కాలనీకి చెందిన మిర్జా అక్తర్ బేగ్ ఆదివారం రమేష్వరం వెళ్లే రైలులో ప్రయాణికుల మొబైల్ ఫోన్లు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు.
వారి వద్ద నుంచి మొత్తం రూ. 2,40,280 విలువైన దొంగిలించిన సొత్తును పోలీసులు రికవర్ చేశారు. ఐఫోన్ 17 ప్రో, రెండు శామ్సంగ్ ఎం21, ఒకటి వివో టీ40, ఆపిల్ ఇయర్ బడ్స్ – 1 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. రైల్వే ప్రయాణికులు తమ ప్రయాణ సమయాల్లో లగేజీ, సెల్ఫోన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
