సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి భారీ భుంగ ఏర్పడి చెరువు కట్ట తెగిపోవడంతో చెరువులోని నీరు పూర్తిగా బయటకు వెళ్లిపోయింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో గురువారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
చెరువు కట్ట తెగిపోవడానికి గల కారణాలు, నీటి ప్రవాహం దిశ, జరిగిన నష్టం, సమీప గ్రామాలపై ప్రభావం, ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు.
ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు సంచరించకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు పికెట్లను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువులు, వాగులు, కాలువలు, వరద ప్రవాహాలు ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లరాదని, చిన్నారులను నీటి వనరుల వద్దకు పంపవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు లేదా డయల్–112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ పరిశీలనలో ధర్పల్లి సీఐ బిక్షపతి, సిరికొండ ఎస్సై జె.రామకృష్ణ, ధర్పల్లి ఎస్సై జి.సందీప్, గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్, గ్రామస్థులు పాల్గొన్నారు.
