నిజామాబాద్ గడ్డపై నుంచి ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని జనసేన రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాస్రావు ప్రకటించారు. బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, జకన్పల్లి ఎయిర్పోర్టు సాధన, నిజామాబాద్ స్మార్ట్సిటీ అభివృద్ధి పనులు, శిథిలావస్థకు చేరిన జిల్లా ప్రభుత్వ కళాశాల సమస్యలపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
నిజామాబాద్లో శనివారం నిర్వహించిన జనసేన నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఆవిర్భవించిన తొలి పార్టీ జనసేన అని పేర్కొన్నారు. జనసేనను ‘ఆంధ్ర పార్టీ’ అంటూ విమర్శించేవారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.
పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం, ఆశయాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో యువత జనసేనలో చేరుతున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని అన్నారు.
స్థానిక సంస్థల వేదికగా ప్రజల తరఫున గళం వినిపిస్తామని తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి జనసేన శ్రేణులు సమష్టిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ విద్యాసంస్థల సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
