కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు సిర్పరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కల్యాణలక్ష్మి పథకాన్ని సైతం ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేద కుటుంబాలకు అండగా నిలిచిన సంక్షేమ పథకాలను కొనసాగించాల్సింది పోయి.. వాటిని కుదించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.సోమవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను సకాలంలో అందించకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని దుయ్యబట్టారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అందించిన పథకాలతో పోలిస్తే ప్రస్తుతం రైతులకు సరైన సమయంలో సాయం అందడం లేదన్నారు.
రుణమాఫీ విషయంలోనూ అనేక మంది రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అందడం లేదని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. సీఎంఆర్ఎఫ్ సాయం కూడా సరిగా అందడం లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి సంక్షేమ పథకాలను ఎత్తివేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని..
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని సిర్పరాజు హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ నుడా ప్రభాకర్, మాజీ మేయర్ నీతూ కిరణ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
