సమాజం కోసం ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సేవలందిస్తున్న సేవామూర్తులను గుర్తించి గౌరవించడం అభినందనీయమని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. యువతలో సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించే దిశగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.
మంగళవారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాస్ఫూర్తి అవార్డ్స్–2026 కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వివిధ రంగాల్లో నిస్వార్థంగా సేవలందిస్తున్న సుమారు 30 మంది సేవామూర్తులను గుర్తించి సేవాస్ఫూర్తి అవార్డులతో సత్కరించారు.
కార్యక్రమాన్ని మేయర్ కూరగాయల ఉమారాణి, నిజామాబాద్ ఏసీపీ బి. ప్రకాష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తమ కోసం కాకుండా సమాజం కోసం జీవించే సేవామూర్తులను గుర్తించి గౌరవించడం గొప్ప విషయమన్నారు.
సేవ అనేది ఒక కార్యక్రమం మాత్రమే కాదని, సమాజం పట్ల మన బాధ్యతను చాటే విలువ అని పేర్కొన్నారు. ఆ విలువలను యువతలో పెంపొందించేలా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమన్నారు.ఏసీపీ బి. ప్రకాష్ మాట్లాడుతూ.. యువత దేశానికి వెన్నెముక లాంటిదన్నారు.
యువతలో సేవాభావం, సామాజిక బాధ్యత మరింత బలపడితే సమాజంలో ఎన్నో సానుకూల మార్పులు తీసుకురావచ్చన్నారు. యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి అండగా నిలుస్తున్న ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయమన్నారు.
ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి అండగా, ఆకలితో ఉన్నవారికి అన్నంగా, ఆపన్నులకు ఆత్మీయతగా, అవసరమైన చోట సేవా హస్తంగా నిలవడమే సంస్థ లక్ష్యమన్నారు.
సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. గైనీ గంగారం మాట్లాడుతూ.. సేవను బాధ్యతగా, మానవత్వాన్ని విలువగా భావిస్తూ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సేవాస్ఫూర్తి అవార్డ్స్ మరింత బలాన్ని, కొత్త స్ఫూర్తిని అందించాయని పేర్కొన్నారు.
వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాకతీయ కళాశాల, ఎస్ఎస్ఆర్ కళాశాల, సత్య వొకేషనల్ కళాశాల, ఇందూరు డిఫెన్స్ అకాడమీ, హోలీ మేరీ హైస్కూల్, విశ్వవికాస్ హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సేవాభిమానులు పాల్గొన్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి వాల బాలకిషన్, మద్ది గంగాధర్, రచర్ల రాజేష్ శర్మ, కొండా నాగేందర్, సుజాత, దారం గంగాధర్, పుష్పవతి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
