కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు నాయకులపై గతంలో విధించిన సస్పెన్షన్, ప్రాథమిక సభ్యత్వ రద్దు ఉత్తర్వులను పార్టీ నాయకత్వం ఉపసంహరించుకుంది.
ఈ మేరకు నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. వరదాబట్టు వేణు రాజ్ (మాజీ రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి), పుండ్ర సాయి కిరణ్ (48వ డివిజన్ మాజీ అధ్యక్షుడు), నరేన్ దీప్ (చింటూ) (మాజీ ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి)లపై కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ కార్యక్రమంలో జరిగిన క్రమశిక్షణా రాహిత్యానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 8న సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వ్యవహారంపై పార్టీ నాయకత్వం పునఃపరిశీలించి, సమగ్రంగా చర్చించిన అనంతరం సస్పెన్షన్, ప్రాథమిక సభ్యత్వ రద్దు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ముగ్గురి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తక్షణమే పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.
ముగ్గురు నాయకులతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబంధాలు కొనసాగించకూడదనే నిబంధనలను కూడా పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించారు.
ఇకపై పార్టీ క్రమశిక్షణను పాటిస్తూ ఏఐసీసీ, పార్టీ అధిష్ఠానం సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని సదరు నాయకులకు సూచించినట్లు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు.
