నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శనివారం ఉదయం నగరంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు.
అనంతరం స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నగరంలోని పాములబస్తీలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణం, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గత ప్రభుత్వాల హయాంలో నిర్మాణం ప్రారంభించి అర్ధంతరంగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని పరిశీలించారు.
నివాసయోగ్యంగా మార్చేందుకు అవసరమైన నిర్మాణ పనులు, మౌలిక వసతులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు.
అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేసి అందించాలని సూచించారు.నాగారంలోని నిర్మితి కేంద్రం వద్ద హౌసింగ్ టవర్స్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు.
ఇందుకోసం నగరపాలక సంస్థ పరిధిలోని హౌసింగ్ శాఖకు సంబంధించిన ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. టవర్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
