మద్యపాన నిషేధానికి పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామస్థులు శ్రీకారం చుట్టారు. సర్పంచ్ ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, ప్రజలు సమావేశమై గ్రామంలో మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.
గ్రామంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా విధించాలని తీర్మానించారు. అంతేకాకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారి సమాచారం అందించిన వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.
గ్రామంలో మద్యపానాన్ని నియంత్రించి ప్రజల ఆరోగ్యం, కుటుంబాల సంక్షేమాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామస్థుల నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
