గాంధీగంజ్లో రిటైల్ కూరగాయల దుకాణాల కేటాయింపుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఏళ్ల తరబడి వ్యాపారం చేసుకుంటున్న పేద వ్యాపారులను పక్కనపెట్టి, అసలు వ్యాపారం చేయని వారికి దుకాణాలు కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నారని రిటైల్ కూరగాయల వ్యాపారి, సంఘం మాజీ అధ్యక్షుడు మాకు రవి ఆరోపించారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగా రెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన తండ్రి స్వర్గీయ మల్లయ్య పేరిట ఉన్న లైసెన్సుపై గత 30 ఏళ్లుగా గాంధీగంజ్లో కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు రవి తెలిపారు.
వ్యాపారుల సంక్షేమం కోసం సుమారు 13 ఏళ్లపాటు సంఘం అధ్యక్షుడిగా పనిచేశానని, 20 ఏళ్లుగా వ్యాపారులకు శాశ్వత దుకాణాల కేటాయింపు కోసం పోరాడుతున్నానని చెప్పారు. అయితే తాను ప్రశ్నిస్తున్నందుకే తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
మార్కెట్ నుంచి తాను తప్పుకుని లైసెన్సు వదులుకుంటే గాంధీగంజ్లోని స్థలాన్ని తన అనుచరులకు కేటాయిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని రవి ఆరోపించారు. 30 ఏళ్లుగా కొనసాగుతున్న లైసెన్సును రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.దుకాణాల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించామని, కోర్టు ఆదేశాల మేరకు బహిరంగ వేలం నిర్వహించినప్పటికీ కేవలం 40 మందికే స్థలాలు కేటాయించారని రవి తెలిపారు.
అందులోనూ కొందరికి ఇప్పటికే హోల్సేల్ లైసెన్సులు ఉండగా, వారికి రిటైల్ లైసెన్సులు కూడా ఇచ్చి రెండు లైసెన్సులు కట్టబెట్టారని ఆరోపించారు.గాంధీగంజ్లో వాస్తవంగా కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న వారికి దుకాణాలు కేటాయించకుండా, అసలు వ్యాపారం చేయని కొందరికి స్థలాలు కేటాయిస్తున్నారని ఆరోపించారు.
అటెండెన్స్ రిజిస్టర్లలో నకిలీ సంతకాలు చేసినట్లు కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు.మార్కెట్ కమిటీ వ్యవహారాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని రవి డిమాండ్ చేశారు. అర్హులైన పేద రిటైల్ కూరగాయల వ్యాపారులకు న్యాయం చేయాలని, దుకాణాల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించాలని కోరారు.
అధికార దుర్వినియోగం, లైసెన్సుల కేటాయింపు, అటెండెన్స్ రిజిస్టర్లలో అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
