పోలీస్ ఉద్యోగార్థుల ప్రీ-రిక్రూట్మెంట్ శిక్షణ శిబిరం సందర్శనప్రభుత్వ ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఏకాగ్రత, పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలమని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. పోలీస్ ఉద్యోగార్థుల కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ప్రీ-రిక్రూట్మెంట్ శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో కొనసాగుతున్న శిక్షణ శిబిరాన్ని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యతో కలిసి కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 200 మందిని ఎంపిక చేసి రెండు నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. అభ్యర్థులకు భోజన వసతితో పాటు థియరీ, దేహదారుఢ్య పరీక్షలకు నిపుణులతో శిక్షణ ఇస్తున్నారు.అభ్యర్థులతో కలెక్టర్ మాట్లాడి పలు సూచనలు చేశారు. రీజనింగ్ ఎబిలిటీ, ఆంగ్లం, గణితం అంశాల్లో ఎక్కువ మార్కులు సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలను వివరించారు. స్వయంగా నైపుణ్య సామర్థ్య పరీక్షలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు నిరంతర ప్రయత్నం కొనసాగించాలని సూచించారు. సరైన ప్రణాళిక, కష్టపడే తత్వం, సానుకూల దృక్పథంతో ఏదైనా సాధించవచ్చని అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు.రెండు నెలల పాటు సెల్ఫోన్, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి శిక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని హితవు పలికారు. అనవసర భయాలను వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మాట్లాడుతూ హైదరాబాద్లో అందించే కోచింగ్కు ఏమాత్రం తీసిపోని విధంగా మెరుగైన స్టడీ మెటీరియల్, నిష్ణాతులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు సరైన మార్గదర్శకత్వం అందించడం పోలీస్ శాఖ సామాజిక బాధ్యతలో భాగమన్నారు. అర్హత, ప్రతిభ ఉన్న అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలు సాధించి ప్రజలకు సేవలందించాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ నిరంతర సాధన చేయాలని సూచించారు. రెండు నెలల పాటు వినోదాలు, వేడుకలకు దూరంగా ఉండి లక్ష్యంపై దృష్టి పెడితే పోలీస్ శాఖలో చేరాలనే కలను సాకారం చేసుకోవచ్చని పేర్కొన్నారు.కార్యక్రమంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డి, భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ భాగ్యకిరణ్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
