రూ. 19.20 లక్షల అపహరణ.. ఎర్టిగా కార్, నగదు స్వాధీనం.. బంగారం వ్యాపారి వద్ద పనిచేసే వ్యక్తిని కిడ్నాప్ చేసి భారీ మొత్తంలో నగదు దోచుకున్న ముఠా గుట్టును మూడవ టౌన్ పోలీసులు రట్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి లక్షా 50 వేల రూపాయల నగదు, ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నట్లు ఇంచార్జి సీఐ సురేష్ కుమార్ తెలిపారు.
శనివారం మూడవ టౌన్ లో కేసు వివరాలు వెల్లడించారు.నాందేవాడకు చెందిన ప్రముఖ బంగారం వ్యాపారి అనిల్ పాటిల్ ఛిద్రవర్ ఈనెల 23వ తేదీన రూ. 19,20,000 నగదును బ్యాంకులో డిపాజిట్ చేయవలసిందిగా తన వద్ద పనిచేసే గంగాధర్ అనే వ్యక్తికి ఇచ్చారు.
గంగాధర్ నగదుతో వెళ్తుండగా, నాందేవాడ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు ఎర్టిగా కారులో వచ్చి అతడిని బలవంతంగా కిడ్నాప్ చేశారు. గంగాధర్ వద్ద ఉన్న రూ. 19.20 లక్షల నగదును లాక్కుని నిందితులు పరారయ్యారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ మేరకు సౌత్ సర్కిల్ ఇంచార్జ్ సీఐ సురేష్,మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు ఆధ్వర్యంలో రంగంలోకి రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ మరియు సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు.
ఈ మేరకు జనవరి 30 నిర్వహించిన తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన వినోద్ శంకర్ పవర్, అమర్ దామోదర్ చర్వాద్, నౌషద్ ఖాదర్ సయ్యద్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారి వద్ద నుంచి రూ. 1.50 లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లు, దోపిడీకి ఉపయోగించిన ఎర్టిగా కారును సీజ్ చేశారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను శనివారం రిమాండ్కు తరలించినట్లు సీఐ సురేష్ తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న షరీఫ్, మయూర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశామని పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన నిందితులను పట్టుకుని పూర్తి నగదును రికవరీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
