ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్థాపానికి గురై ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తంచేశాడు. ఈ ఘటన రూరల్ నియోజకవర్గంలోని మల్లారం గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్థుల వివరాల ప్రకారం… మల్లారం గ్రామానికి చెందిన ఎం.సాయిలు అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు రాలేదని గురువారం ఉదయం సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఇందిరమ్మ ఇంటికి అర్హతలున్నాయని అందుకోసమే ముందుగా ఇల్లు బేస్మెంట్ వరకు కట్టుకున్నట్లు తెలిపారు.
సంబంధిత అధికారులు అనర్హతగా ప్రకటించడంతో మల్లారం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కినట్లు తెలిపారు. ఈ విషయం స్థానిక కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డికి సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఫోన్ లో అక్కడ ఉన్న స్థానిక నాయకులతో మాట్లాడి ఎం.సాయిలు అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో సెల్ టవర్ నుంచి దిగడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
