మున్సిపల్ ఎన్నికల వేళ పుర పాలక సంస్థ ఖజానా ఒక్కసారిగా కళకళలాడుతోంది. ఏళ్ల తరబడి అధికారులు నోటీసులిచ్చినా, జరిమానాలు వేసినా ససేమిరా అన్న బకాయిదారులు.. ఇప్పుడు నామినేషన్ల కోసం క్యూ కట్టి మరీ పన్నులు చెల్లిస్తున్నారు.
తాజాగా నగరంలోని ఒక డివిజన్ అభ్యర్థి ఏకంగా రూ. 8 కోట్ల ఆస్తిపన్ను బకాయిలను చెల్లించడం కార్పొరేషన్ వర్గాల్లోనే కాదు, నగరం మొత్తంలో చర్చనీయాంశమైంది. మున్సిపల్ బరిలో నిలవాలంటే అభ్యర్థులు కచ్చితంగా ‘నోడ్యూ సర్టిఫికెట్’ సమర్పించాల్సి ఉండడంతో ఆశావహులంతా గత కొన్ని రోజులుగా ఆస్తిపన్ను శాఖాధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
ఒక్క రూపాయి బకాయి ఉన్నా నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండడంతో, ఇన్నాళ్లుగా అటకెక్కించిన బకాయిల లెక్కలన్నీ ఇప్పుడు బయటకు తీస్తున్నారు. గత మూడు రోజులుగా మున్సిపల్ కార్యాలయాలు పన్ను చెల్లింపుదారులతో కిక్కిరిసిపోతున్నాయి.
వందలాది మంది అభ్యర్థులు తమ పాత బకాయిలన్నీ క్లియర్ చేస్తుండడంతో కార్పొరేషన్ ఖజానాకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరింది. అధికారుల విజ్ఞప్తులకు లొంగని వారు సైతం ఎన్నికల నిబంధనల దెబ్బకు దారిలోకి వచ్చారు.
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న మొండి బకాయిలు కూడా ఇప్పుడు వసూలవుతుండడం గమనార్హం. మొత్తానికి, ఎన్నికల సమరం మొదలవ్వకముందే మున్సిపాలిటీకి పన్నుల రూపంలో ‘విజయం’ దక్కినట్లయింది.
