ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ప్రెస్ ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటో గ్రఫీ డే నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్ అంటే కేవలం కెమెరా ఆపరేటర్ కాదని, సమాజంలో జరిగే మంచి, చెడు, చారిత్రక సంఘటనలను భవిష్యత్ తరాలకు భద్రపరిచే వారన్నారు. చరిత్రలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఫోటోల ద్వారానే మనకు గుర్తుండిపోతాయన్నారు.
ప్రకృతి విపత్తులు, సామాజిక కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, విజయాలు, ప్రతి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకురావడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర కీలకం అని చెప్పారు. జర్నలిస్టుల చిరకాల వాంఛ ఇళ్ళ స్థలాల కోసం తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
గతంలో అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. నిజామాబాద్ జర్నలిస్టుల్లో ఐక్యత ఉంటుందని, ఇదే ధోరణితో ముందుకు సాగాలన్నారు.
కార్యక్రమంలో ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రతన్, ప్రధాన కార్యదర్శి భానూతేజ, గౌరవ అధ్యక్షుడు గోవిందరాజు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుభాష్, కోశాధికారి రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజు, సీనియర్ ఫోటో గ్రాఫర్ బాలరాజు, నరసింహ చారి, శ్రీనివాస్, ఇంగు శ్రీనివాస్, వీడియో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు నాగేష్, సీనియర్ ఫోటో గ్రాఫర్లు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
