HomeLaw and Orderరాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆధునీకరణకు చర్యకు చేపట్టాలి- కలెక్టర్ ఇలా త్రిపాఠి

రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆధునీకరణకు చర్యకు చేపట్టాలి- కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, మార్చి 11 : నిజామాబాద్ నగర నడిబొడ్డున గల రాజీవ్ గాంధీ ఆడిటోరియంను ఆధునీకరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె రాజీవ్ గాంధీ ఆడిటోరియం, న్యూ అంబేద్కర్ భవన్ లను సందర్శించారు.

ఆడిటోరియం హాల్, పరిసరాలను నిశితంగా పరిశీలించారు. సంస్కృతిక కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించేందుకు ఆడిటోరియం అనువైనదిగా ఉన్నందున, దీనిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించి ఆధునీకరించాలని కలెక్టర్ సూచించారు.

ఎయిర్ కండిషన్ సదుపాయం సైతం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆధునీకరణ పనులకు అయ్యే అంచనా వ్యయం, అందుబాటులో ఉన్న నిధులు తదితర సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ను ఆదేశించారు.

ఆడిటోరియంను ఆనుకుని పక్కనే ఉన్న న్యూ అంబేద్కర్ భవన్ ను కూడా మరమ్మతులు చేయించి, సరైన విధంగా నిర్వహణ జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు.

శిక్షణ కార్యక్రమం కోసం వేదికల పరిశీలన

కాగా, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఈ నెల 12న ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్న నేపధ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి పలు వేదికలను పరిశీలించారు. న్యూ అంబేద్కర్ భవన్, రాజీవ్ గాంధీ ఆడిటోరియంతో పాటు అమృతా గార్డెన్ లను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.

నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కార్పోరేషన్ మేయర్లు, చైర్ పర్సన్ లు, కౌన్సిలర్లు, గ్రామ పంచాయతీల సర్పంచ్ లకు ఉదయం నుండి సాయంత్రం వరకు శిక్షణ కార్యక్రమం కొనసాగనున్న దృష్ట్యా అనువైన వేదికలను ఎంపిక చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీ.పీ.ఓ శ్రీనివాస్ రావు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments