జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రాణాలను రక్షించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలిపారు.
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రాయన్ పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ‘వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ’ ను మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ప్రతి ప్రయాణికుడు రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు. రహదారులపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్, సీటు బెల్టు ధరించడం తప్పనిసరి అని, చిన్నారులకు కూడా హెల్మెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారులపై వాహనాల మధ్య సురక్షిత దూరం పాటిస్తూ, అతివేగాన్ని నియంత్రించుకోవాలని కోరారు.
“మనం క్షేమంగా ఇంటికి చేరుకోవడమే మన కుటుంబ సభ్యులకు ఇచ్చే అతిపెద్ద కానుక.. నిబంధనలు ఉల్లంఘించి ఎవరూ కన్నీరు మిగల్చవద్దు” అని ఆయన హితవు పలికారు. నూతనంగా ప్రవేశపెట్టిన వి.ఐ.డి.ఎస్ వ్యవస్థ విశిష్టతలను డీజీపీ వివరించారు.
ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్లేషణలతో పనిచేస్తుందని, హై-డెఫినిషన్ నిఘా కెమెరాల ద్వారా మానవ ప్రమేయం లేకుండానే ట్రాఫిక్ను నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. అనంతరం చంద్రాయన్ పల్లి గ్రామస్తులతో కలిసి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంపై డీజీపీ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వారెడ్డి, ఇన్ఛార్జి ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ఆర్మూర్ ఏసీపీ వెంకటరెడ్డి, డిచ్పల్లి సీఐ కె. వినోద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఎస్సైలు ఆరీఫ్, సందీప్, ప్రాజెక్ట్ మేనేజర్లు వర్ష, వంశీధర్, సర్పంచ్ రఘు తదితరులు పాల్గొన్నారు.
