భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను కొందరు తమ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటూ, సమాజాన్ని కులాల పేరుతో విభజించేందుకు కుట్ర చేస్తున్నారని ప్రముఖ నాయకులు సంజయ్ పురోహిత్ విమర్శించారు.
మంగళవారం ధర్మపూర్ హిల్స్ మరియు సరంగాపూర్ ప్రాంతాల్లో దీపక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ హరిచరణ్తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సంజయ్ పురోహిత్ మాట్లాడుతూ.. అంబేద్కర్ తన జీవితాంతం ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యాభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. అయితే, నేడు ఆయన పేరు చెప్పుకుని పబ్బం గడుపుకుంటున్న కొందరు నేతలు ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నారని మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దళితబంధు పథకం కింద వేల కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ప్రచారం చేసుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పేద దళితులకు పూర్తి ప్రయోజనం అందలేదని విమర్శించారు.
ప్రతి లబ్ధిదారుడి నుంచి సుమారు రెండు లక్షల రూపాయల వరకు కమిషన్ల రూపంలో వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఇది దళితుల అభివృద్ధి కాదని, పచ్చి రాజకీయ దోపిడీ అని దుయ్యబట్టారు. ప్రజలు ఇకనైనా వాస్తవాలను గ్రహించాలని, కులాల పేరుతో చీల్చి పాలించే రాజకీయాలకు బలికావద్దని ఆయన పిలుపునిచ్చారు.
అంబేద్కర్ చూపిన ఐక్యత, విద్య, స్వాభిమానం అనే మార్గాల్లో నడిచినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశ్, బంటీ, పవన్, రాజ్, సమీర్, జుబైర్ తదితరులు పాల్గొన్నారు.
