నారీ శక్తి…దేశానికే శక్తి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని నాందేవ్ వాడ శివాజీ చౌక్ నుంచి ఉమా మహేశ్వరాలయం వరకు నారీ శక్తి వందన్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా స్వతంత్రం చేయడం, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు పెంచడం, మహిళల హక్కులు రక్షించడం.. నారీ శక్తి అభియాన్ ముఖ్య ఉద్దేశం అన్నారు. మహిళల పాత్ర కుటుంబం నుంచి దేశాభివృద్ధి వరకు కీలకం కానుందన్నారు.
మహిళలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇది కేవలం ఒక పథకం కాదని, మహిళలను సమాన హక్కులతో సమాజంలో ముందుకు తీసుకెళ్లే మహత్తర ఉద్యమం అన్నారు. * కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళుగా అమలు చేయని మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని మోదీ చేస్తున్నారన్నారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని తెలిపారు.
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని చెప్పారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకురాలు, ఆదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక ఉద్యమంలో మహిళలు రాణిస్తున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలన్నారు. క్రీడల్లో అంతరిక్షంలో దేశ స్వతంత్రంలో రాజకీయాల్లో మహిళల పాత్ర పెరుగుతుందని గుర్తు చేశారు. మొదటిసారి 1996లోనే మహిళా బిల్లు ప్రవేశపెట్టారని కానీ మోక్షం కలగలేదన్నారు.
ప్రధాని మోదీ వల్ల సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ గొప్ప నిర్ణయం అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతి, విప్ న్యాలం సునీత, కార్పొరేటర్లు కల్పే అర్చనా, వైష్ణవి, ఇప్పకాయల సుమిత్ర, కాంపల్లి మమత, ప్రసూన తదితరులు పాల్గొన్నారు.
