ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో ఉత్కంఠభరితంగా సాగిన పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. గురువారం వెలువడిన తుది విడత ఫలితాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. గత రెండు విడతల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన అధికార కాంగ్రెస్ పార్టీకి, ఈ విడతలో ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా మండల కేంద్రాల్లో తన పట్టును నిలబెట్టుకుంటూ బీఆర్ఎస్ సత్తా చాటడంతో ‘హస్తం’ జోరుకు బ్రేక్ పడినట్లయింది.డివిజన్ వ్యాప్తంగా జరిగిన పోలింగ్లో ఓటర్లు అత్యంత చైతన్యాన్ని ప్రదర్శించారు.
ఫలితాల్లో ఓటరు నాడి ఎవరికీ అంతుచిక్కకుండా ఉన్నప్పటికీ, కీలకమైన మండల కేంద్రాలపై పట్టు సాధించడంలో బీఆర్ఎస్ సఫలమైంది. 11 మండల కేంద్రాలకు గాను ఏర్గట్ల, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూరు, బాల్కొండ వంటి ప్రధాన పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్ పీఠాలను దక్కించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ అభ్యర్థుల గెలుపుకు బాటలు వేశాయని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.ఈ ఎన్నికల్లో ఎలాగైనా తన ఉనికిని చాటుకోవాలని భావించిన భారతీయ జనతా పార్టీకి ఆర్మూర్ డివిజన్లో తీవ్ర నిరాశే ఎదురైంది.
క్షేత్రస్థాయిలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే కేంద్రీకృతమవ్వడంతో బీజేపీ కనీస ప్రతినిధ్యాన్ని కూడా దక్కించుకోలేక చతికిలపడింది.
తుది విడత ఫలితాల్లో మండల కేంద్రాలను కైవసం చేసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోగా, కాంగ్రెస్ శిబిరంలో ఆశించిన స్థాయి ఫలితాలు రాకపోవడంతో అంతర్మథనం మొదలైంది.
