నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సొంత మండలమైన భీంగల్లో పార్టీ శ్రేణులు సత్తా చాటాయి.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ వార్డులను కైవసం చేసుకుని, మున్సిపాలిటీపై కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తన సొంత గడ్డపై పార్టీ సాధించిన ఈ విజయం పట్ల మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీంగల్ ప్రజలు అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కట్టారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక పాలనపై ప్రజలు ఉంచిన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. “ఇది ప్రజల ఆశయాల గెలుపు. భీంగల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం” అని ఆయన స్పష్టం చేశారు.
పట్టణంలో మౌలిక వసతులైన తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
ఫలితాల వెల్లడి అనంతరం భీంగల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. టీపీసీసీ చీఫ్ నాయకత్వంలో నిజామాబాద్ జిల్లాలో పార్టీ మరింత బలపడిందని నేతలు అభిప్రాయపడ్డారు.
ఎన్నికల సమయంలో అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు మహేష్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భీంగల్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
