నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను బీజేపీ కార్పొరేటర్లు ఖండించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్, 22వ డివిజన్ కార్పొరేటర్ సాయి వైష్ణవి మాట్లాడారు.
ఎంపీ అరవింద్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ శ్రేణులు చూస్తూ ఊరుకోవని ఎర్రం సుధీర్ హెచ్చరించారు.పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర లేదని, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన అనుభవం కూడా లేదని అన్నారు.
బాల్కొండకు చెందిన ఈరవత్రి అనిల్ గతంలో ఒకసారి గెలిచిన తర్వాత ఎన్నికల్లో విజయాన్ని సాధించలేదని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు, 28 మంది కార్పొరేటర్లు, వందకుపైగా సర్పంచులు, లక్షలాది కార్యకర్తల బలం ఉందన్నారు. జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించడం లేదని విమర్శించారు.
బీజేపీ గెలిచిన 28 డివిజన్లలో ఏదైనా ఒక డివిజన్లో పోటీకి రావాలని కోరారు. సంబంధిత కార్పొరేటర్ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ ఏమిటో తేలిపోతుందని అన్నారు. బెదిరింపుల రాజకీయాలను బీజేపీ కార్యకర్తలు సహించరని పేర్కొన్నారు.
సాయి వైష్ణవి మాట్లాడుతూ.. నగర కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 28 స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఇతర పార్టీలు పొత్తుతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ మేయర్ అయితే నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన మహేశ్కుమార్ గౌడ్ ఇప్పటివరకు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
22వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి తాను గెలిచానని, రాజకీయ కక్షలకు తావివ్వకుండా డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
అవసరమైతే తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమని సవాల్ విసిరారు. సమావేశంలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
