ఎస్సారెస్పీ ముప్కాల్ లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద బ్యాక్వాటర్లో గల్లంతైన యువకులలో మిగతా ఒకరి మృతదేహం కూడా లభ్యమైంది. దీంతో ఈ ప్రమాదంలో గల్లంతైన నలుగురి జాడ ముగిసి, అందరి మృతదేహాలు వెలికితీసినట్లయింది.
ఆదివారం లభించిన ముగ్గురితో పాటు, తాజాగా గల్లంతైన నిజామాబాద్ ఆటోనగర్కు చెందిన అజీమ్ ఖాన్ మృతదేహాన్ని సోమవారం ఉదయం గజఈతగాళ్ల సహాయంతో పోలీసులు, అధికారులు వెలికితీశారు. కాగా, ఎస్సారెస్పీ హెడ్ రెగ్యులేటర్ వద్ద బ్యాక్వాటర్లో నీటిలో మునిగి నలుగురు యువకులు గల్లంతైన విషయం విదితమే.
ఈ ఘటనలో మృతులు నిజామాబాద్ ఆటోనగర్కు చెందిన నజావత్ అలియాస్ అమ్ము, ఖలీం, మహారాష్ట్ర భోకర్ ప్రాంతానికి చెందిన ఖాజా రెహన్గా ఇదివరకే గుర్తించారు. తాజాగా నాలుగో వ్యక్తి అజీమ్ ఖాన్ మృతదేహం కూడా లభించడంతో ఆటోనగర్ ప్రాంతంలో, మృతుల కుటుంబాలలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
