కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ, పేద కూలీల పొట్టగొడుతోందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కాట్పల్లి నగేష్ రెడ్డి విమర్శించారు.
గురువారం డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కలుగుతున్న నష్టాలను ఆయన వివరించారు.
ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం మహాత్మా గాంధీ పేరును రూపుమాపాలనే దురుద్దేశంతోనే కేంద్రం ఈ పథకంలో అనవసర మార్పులు చేస్తోందని మండిపడ్డారు. 125 రోజుల పని కల్పిస్తామని గొప్పలు చెబుతున్న కేంద్రం, అందులో 50 రోజుల వేతన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టడం అన్యాయమన్నారు.
దీనివల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరిగి, పథకం అమలు కుంటుపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో గ్రామసభల ద్వారా ప్రజలే తమకు కావాల్సిన పనులను, సమయాన్ని నిర్ణయించుకునే వారని, కానీ కొత్తగా వచ్చిన ‘జి రామ్ జీ’ విధానం వల్ల ఉపాధి హామీ వ్యవస్థ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని ఆయన ఆరోపించారు.
వెను వెంటనే ఈ కొత్త విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ముల్లంగి గ్రామ సర్పంచ్ సుధం శ్రీను, మాజీ ఎంపీపీ నర్సయ్య, ఏఎంసీ డైరెక్టర్ గంగారెడ్డి, ఉప సర్పంచ్ అశోక్, మాజీ సర్పంచ్ మధుసూదన్, డిచ్పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
