సీసీఎస్ పోలీసుల అదుపు నుంచి పరారవడం నిజామాబాద్ పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. ట్రాఫిక్ పోలీసులు అప్పగించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న కొద్ది సేపటికే సీసీఎస్ సిబ్బంది కళ్లు కప్పి తప్పించుకోవడంతో భద్రతా లోపాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శనివారం సాయంత్రం ట్రాఫిక్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో నిఖిల్ సాయి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ సమయంలో నంబర్ ప్లేట్ లేని మోటార్సైకిల్పై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరిని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. పోలీసులను గమనించిన వారు బైక్ను అక్కడే వదిలేసి పరారయ్యేందుకు యత్నించగా, ట్రాఫిక్ సిబ్బంది వెంటాడి ఒకరిని పట్టుకోగా మరో వ్యక్తి చీకటిని ఆసరాగా చేసుకుని తప్పించుకున్నాడు.
పట్టుబడిన వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద బంగారు గొలుసు లభించింది. అలాగే వారు వదిలివెళ్లిన మోటార్సైకిల్ చోరీకి గురైనదిగా పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని, స్వాధీనం చేసుకున్న చోరీ బైక్, బంగారు గొలుసును తదుపరి విచారణ కోసం సీసీఎస్ పోలీసులకు అప్పగించారు.
అయితే సీసీఎస్ అదుపులో ఉన్న నిందితుడు పోలీసులనే మోసగించి పరారవడం చర్చనీయాంశంగా మారింది. పరారైన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు సమాచారం.
కస్టడీ నుంచి నిందితుడు ఎలా తప్పించుకున్నాడన్న దానిపై ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
