మహిళ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష,అలాగే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు మృతదేహాన్ని దాచిపెట్టినందుకు అదనంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్. భారతలక్ష్మి సోమవారం తీర్పు వెలువరించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవిందపేట గ్రామంలో మిర్యాల పోషవ్వ గోసంగి (50) అద్దె ఇంట్లో నివసించేది.
మామిడిపల్లికి చెందిన షేక్ మహబూబ్ తరచూ ఆమె ఇంటికి వచ్చి వెళ్లేవాడు. 2025 జనవరి 30న ఉదయం ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణలో షేక్ మహబూబ్ హత్య చేసినట్లు నిర్ధారించి అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు నిందితుడి నేరం రుజువైందని తేల్చింది.
దీంతో హత్య నేరానికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. అలాగే మృతదేహాన్ని దాచిపెట్టి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు అదనంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, మరో రూ.1,000 జరిమానా విధించింది.
జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. కేసును పకడ్బందీగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన ఆర్మూర్ ఎస్హెచ్ఓ పి. సత్యనారాయణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. రాజేశ్వర్ రెడ్డి, కోర్టు లైజనింగ్ అధికారి ఎస్ఐ గోవిందు, కోర్టు డ్యూటీ సిబ్బంది ఎం. గంగాధర్, టి. సుభాష్, కె. నారాయణ, హోంగార్డు శ్రీనివాస్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.
