- 1,513 బ్లాక్ స్పాట్లలో 1,308కు శాశ్వత పరిష్కారం..
- నిజామాబాద్లో 75, జగిత్యాలలో 99 ప్రమాదకర ప్రాంతాల్లో పనులు పూర్తి
- లోక్సభలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం
తెలంగాణలో జాతీయ రహదారులపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతోందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
లోక్సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన ప్రమాదకర ప్రాంతాలు (యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లు), వాటి నివారణకు చేపట్టిన చర్యలు, నిజామాబాద్–జగిత్యాల జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై వివరాలను వెల్లడించారు.
మంత్రి సమాధానం ప్రకారం తెలంగాణలో జాతీయ రహదారులపై మొత్తం 1,513 యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లు గుర్తించగా, వాటిలో 1,308 బ్లాక్ స్పాట్లకు శాశ్వత నివారణ చర్యలు పూర్తయ్యాయి. మిగిలిన 205 ప్రాంతాల్లో ఇంజినీరింగ్ మార్పులు, రోడ్డు విస్తరణ, సిగ్నలింగ్, హెచ్చరిక బోర్డులు, ఇతర భద్రతా చర్యలు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు.
నిజామాబాద్కు ప్రత్యేక ప్రాధాన్యం
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 78 ప్రమాదకర బ్లాక్ స్పాట్లు గుర్తించగా, వాటిలో 75 ప్రాంతాల్లో శాశ్వత నివారణ చర్యలు పూర్తయ్యాయి. మిగిలిన మూడు ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. అలాగే జగిత్యాల జిల్లాలో 107 బ్లాక్ స్పాట్లు గుర్తించగా, 99 ప్రాంతాల్లో పనులు పూర్తి కాగా, మరో ఎనిమిది ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఎన్హెచ్-44, ఎన్హెచ్-63, ఎన్హెచ్-61పై పనులు
నిజామాబాద్, జగిత్యాల జిల్లాల మీదుగా వెళ్లే ఎన్హెచ్-44, ఎన్హెచ్-63, ఎన్హెచ్-61 జాతీయ రహదారులపై రోడ్డు భద్రతను మెరుగుపరిచే చర్యలు, వంతెనల నిర్మాణం, బైపాస్లు, జంక్షన్ అభివృద్ధి, రోడ్డు విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాల పనులు జాతీయ రహదారి అభివృద్ధి కార్యక్రమాల కింద ప్రణాళిక, అమలు దశల్లో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
రూ.1,023 కోట్లతో అభివృద్ధి
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో రోడ్డు భద్రత, బ్లాక్ స్పాట్ల నిర్మూలన, వంతెనలు, బైపాస్లు, ఇతర జాతీయ రహదారి అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.1,023 కోట్లు కేటాయించినట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.
ఈ నిధులతో ప్రమాదాల నివారణతో పాటు ప్రయాణికులకు మరింత సురక్షితమైన రహదారి వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు.
పనులు వేగవంతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి
నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల భద్రతే తన ప్రాధాన్యమని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. జిల్లాలో ఇంకా పెండింగ్లో ఉన్న రోడ్డు భద్రతా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.
ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కారాలు అమలు చేయడంలో కేంద్రంతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తానని చెప్పారు.
రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడం, ప్రజల ప్రాణాలను రక్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు రాష్ట్రంలోని జాతీయ రహదారుల భద్రతను మరింత బలోపేతం చేస్తాయని ఎంపీ అర్వింద్ అభిప్రాయపడ్డారు.
