ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట ఇసుకను అక్రమంగా దారి మళ్లించాడనే ఫిర్యాదు మేరకు, మెండోరా రెవెన్యూ ఇన్స్ పెక్టర్ (ఆర్ఐ) సదానంద్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు గట్టి నిఘా కొనసాగిస్తున్న విషయం విదితమే. మన ఇసుక వాహనం బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే ఇసుక తరలింపునకు అనుమతులు జారీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మెండోరా మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ సదానంద్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట ఇసుక తరలింపునకు అనుమతులు పొంది, ఇసుక నిల్వలను దారి మళ్లిస్తున్నట్లు కలెక్టర్ దృష్టికి వచ్చింది. ఈ విషయమై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను సైతం అధికారులతో వాకబు చేయించగా, తమకు ఇసుక అందలేదని వెల్లడించారు.
దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, మెండోరా రెవెన్యూ ఇన్స్ పెక్టర్ సదానంద్ ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక అక్రమ దారి మళ్లింపు విషయమై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని మైనింగ్ ఏ.డీని ఆదేశించారు. ఇసుక రవాణాలో అక్రమాలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అక్రమాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.
