నిజామాబాద్ నార్త్ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జె.రాహుల్పై సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
రెవెన్యూ రికార్డుల (పహాణీల)లో అక్రమ మార్పులు చేయడం, రికార్డుల తారుమారు, విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా పాలనాధికారి కఠిన చర్యలకు ఉపక్రమించారు. సదరు ఉద్యోగిని సస్పెండ్ చేయడంతో పాటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
నిజామాబాద్ నార్త్ మండలం పరిధిలోని కంటేశ్వర్ ప్రాంతంలో సర్వే నంబర్లు 291/ఏ, 291ఏఏ, 292లకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో టాంపరింగ్ జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందిస్తూ, ప్రాథమిక విచారణ జరిపించారు. రెవెన్యూ రికార్డుల టాంపరింగ్ వాస్తవమేనని విచారణలో వెల్లడైంది.
దీంతో విచారణ నివేదిక ఆధారంగా, రెవెన్యూ రికార్డుల (పహాణీల)లో అక్రమ మార్పులు చేయడం, రికార్డుల తారుమారు, విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రికార్డు అసిస్టెంట్ జే.రాహుల్ ను సస్పెండ్ చేయడంతో పాటు శాఖాపరంగా సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
శాఖాపరమైన విచారణ అనంతరం సమగ్ర నివేదికను అనుసరిస్తూ తదుపరి చర్యలు ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడం, విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.
