నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సరళిని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య క్షుణ్ణంగా పర్యవేక్షించారు. బుధవారం ఉదయం నుంచే నిజామాబాద్ నగరం సహా ఆర్మూర్, బోధన్, భీంగల్ ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది ఎక్కడా అలసత్వం వహించరాదని, ఓటర్లతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే నగరంలోని ఎస్.ఎఫ్.ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘ఎకో ఫ్రెండ్లీ’ మోడల్ పోలింగ్ స్టేషన్ను సీపీ ప్రత్యేకంగా సందర్శించారు.
అనంతరం చంద్రశేఖర్ కాలనీ, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, కోటగల్లిలోని పీఏసీఎస్ కేంద్రం, బర్కత్పురా నేషనల్ హైస్కూల్, నాలెడ్జ్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్, ధర్మపురి హిల్స్ లోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలోని పోలింగ్ బూత్లను తనిఖీ చేశారు. పర్యవేక్షణ సమయంలో ఒక వృద్ధుడిని వీల్ చైర్ లో పోలింగ్ బూత్ లోపలికి తీసుకెళ్లడంలో సీపీ సాయి చైతన్య స్వయంగా సహాయం అందించి తన మానవీయతను చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్, ఏసీపీలు ప్రకాష్, మస్తాన్ అలీ, సీఐలు శ్రీనివాసరాజ్, సురేష్ కుమార్, సాయినాథ్, సతీష్, ఎస్సైలు ముజాహిద్, వెంకట్రావు, షరీఫ్ పాల్గొన్నారు.
