జిల్లా కేంద్రంలోని గూపన్పల్లి కమాన్ వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివిధ పార్టీల నాయకులు భారీగా గుమిగూడటంతో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రహదారిపై వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో రంగంలోకి దిగిన పోలీసులు..
అక్కడ గుమిగూడిన పార్టీ నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల విజ్ఞప్తిని నాయకులు పట్టించుకోలేదు. అప్పటికే నగరంలో 144 సెక్షన్ నిబంధనలు అమలులో ఉండటం, వాటిని ఉల్లంఘిస్తూ ఆందోళన కొనసాగించడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది.
పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో నిబంధనల ఉల్లంఘన కింద పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో నాయకులు అక్కడి నుంచి చెల్లాచెదురయ్యారు. లాఠీఛార్జ్ అనంతరం పోలీసులు గూపన్పల్లి కమాన్ వద్ద ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉంది.
