పశ్చిమ బెంగాల్ తరహాలోనే ప్రజా పోరాటాలతోనే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు ఆయన రంగారెడ్డి గ్రామీణ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం శంషాబాద్ వేదిక గా నిర్వహించిన సభలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల బీజేపీ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్బంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విపక్షంలో ఉన్న బీజేపీ ప్రజా పోరాటాలు చేయాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ప్రజాసేవ, పోరాటాల ద్వారానే అధికారంలోకి రాగలుగుతామని నితిన్ నబీన్ అన్నారు.పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తానని ప్రతి కార్యకర్త సంకల్పించుకోవాలని నితిన్ నబీన్ అన్నారు.
పశ్చిమ బెంగాల్ లో కార్యకర్తల సంకల్పం వల్లే ఘన విజయం సాధించామని అన్నారు. బెంగాల్ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో కార్యకర్తలు, నాయకులు పొరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కాషాయ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే.. తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని అన్నారు
